హైదరాబాద్వాసులకు, తరచూ హైదరాబాద్ వచ్చిపోయే వారికి నగరం నడిబొడ్డున ఉన్న మొజంజాహీ మార్కెట్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. 1935వ సం.లో చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ హయంలో నిర్మించబడింది. అయితే ఇది కూడా పాలకుల నిర్లక్ష్యం కారణంగా నానాటికీ దయనీయస్థితికి చేరుకోసాగింది. ఇది గమనించిన అర్బన్ డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మార్కెట్ పునరుద్దరణకు నడుం బిగించారు. ఈ ఏడాది మార్చి నెల నుంచి యుద్దప్రాతిపదికన ఈ మార్కెట్ భవనానికి మరమత్తుల పనులు జోరుగా సాగుతున్నాయి.
ముందుగా దశాబ్దాలుగా పూడుకుపోయిన మార్కెట్ డ్రైనేజి వ్యవస్థలను శుభ్రపరిచి, అవసరమైన చోట కొత్త డ్రైనేజీలను నిర్మిస్తున్నారు. మార్కెట్ కు మంచి నీటిని సరఫరా చేసే తుప్పు పట్టిపోయిన పాత పైప్ లైన్లను తొలగించి కొత్తవాటిని బిస్తున్నారు. అలాగే దశాబ్దాల క్రితం చేసిన ఎలెక్ట్రికల్ వైరింగ్ ను పూర్తిగా తొలగించి, అత్యాధునికమైన ఎలక్ట్రికల్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మార్కెట్ భవనం స్లాబు నుంచి క్రిందకు నీళ్ళు లీక్ కాకుండా మొత్తం స్లాబును వాటర్ ప్రూఫింగ్ చేయిస్తున్నారు.
మార్కెట్ కు ప్రత్యేక గుర్తింపునిస్తున్న మినార్ కు మరమత్తులు చేస్తున్నారు. అలాగే చిరకాలంగా మరమత్తులకు నోచుకోక పాడైపోయిన మెజిస్టిక్ టవర్ లోని గడియారాలను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. అవి గంటకు ఒకసారి గంటలు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందరూ వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఫోటోలు తీసుకొంటున్నారు.
ఈ మరమత్తులన్నీ పూర్తయిన తరువాత సాండ్ బ్లాస్టింగ్ పద్దతిలో మార్కెట్ గోడలను శుభ్రపరిచి, సహజసిద్దమైన రంగులు వేస్తారు. ఈ మరమత్తులకు సుమారు రూ.18 కోట్లు వరకు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. దీపావళి పండుగకల్లా మార్కెట్ కొత్త అందాలతో, సరికొత్త సౌకర్యాలతో సిద్దమవుతుందని అరవింద్ కుమార్ చెప్పారు.