గత నాలుగేళ్ళుగా నిద్రాణాస్థితిలో ఉన్న రాజకీయనేతలు అందరూ ఇప్పుడు ఏదో ఓ పేరుతో హడావుడి చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటమే అందుకు కారణం. మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా ప్రస్తుతం అదే చేస్తున్నట్లున్నారు. అయన తన అనుచరులతో కలిసి సోమవారం ఉదయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయం మెట్లమీద కూర్చొని ధర్నా చేశారు.
వేములవాడ ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెరాస సర్కార్ గొప్పలు చెప్పుకోవడమే తప్ప నాలుగేళ్ళు పూర్తయినా చేసిందేమీలేదని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కనుక ఇకనైనా తెరాస సర్కార్ తన హామీని నిలబెట్టుకొని వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇస్తానన్న రూ.100 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెరాస సర్కార్ వేములవాడ ఆలయాభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ హడావుడి చేస్తున్న పొన్నం ప్రభాకర్ ఇదే మాట మూడేళ్ళ క్రితమే అడిగి ఉండవచ్చు. అప్పటి నుంచే ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి చేయగల అవకాశం కూడా ఆయనకు ఉంది. కానీ అయన కూడా ఇంతకాలం ఈ విషయం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆలయం ముందు కూర్చొని హడావుడి చేస్తున్నారు. ఎందుకు?