తెలంగాణా రాష్ట్ర ఆర్ధికమంత్రి శుక్రవారం కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప గార్డెన్స్ లో మొత్తం 304 మంది కళ్యాణలక్ష్మి, షాదీ ముబారాక్ లబ్దిదారులకు రూ.2.21 కోట్లు విలువగల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకముందు పెళ్లి మండపంలోనే చెక్కులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
పేద ప్రజల కోసం తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలను ఎన్నికల కోసం పెట్టిన స్కీములేనని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను నమ్మవద్దని మంత్రి ఈటల రాజేందర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందని, ఇక ముందు కూడా అనేక పధకాలు ప్రవేశపెడుతుందని వాటికి ఎన్నికలతో ఎటువంటి సంబందమూ లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
పేద కుటుంబాలలో ఆడపిల్లల పెళ్ళిళ్ళకు తెలంగాణా ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తుండటం చాలా అభినందనీయం. అయితే పెళ్ళి జరిగిన తరువాత లేదా పెళ్ళి మండపంలో చెక్కులు అందించడం కంటే పెళ్ళికి 10 రోజుల ముందు అందించగలిగితే అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అంత ముందుగా చెక్కులు ఇవ్వడం కాస్త రిస్కుతో కూడుకున్నదే కానీ పేద కుటుంబాలలో పెళ్ళి కోసం ప్రభుత్వం ఆ మాత్రం రిస్క్ తీసుకోవచ్చు. అవసరమైతే చట్టపరమైన నిబంధనలు విధించడం ద్వారా అక్రమాలు జరుగకుండా నివారించవచ్చు.