నల్గొండవాసులకు శుభవార్త! నల్గొండ జిల్లా కేంద్రంలో వైద్యకళాశాల ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వైద్యకళాశాల ఏర్పాటుకు పాలనాపరమైన అనుమతులతో పాటు, దాని నిర్మాణం, అవసరమైన సౌకర్యాల కల్పన, పరికరాలు, ఇతర సామాగ్రి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తెరాస అధికారంలోకి వస్తే నల్గొండలో వైద్యకళాశాల నిర్మిస్తామని 2014 ఎన్నికల సమయంలో కెసిఆర్ వాగ్దానం చేశారు. అది ఇన్నాళ్ళకు అమలుకాబోతోంది. వైద్యకళాశాల కోసం నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేశారు. కనుక ఆయనకు కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. విశేషమేమిటంటే, బుధవారం అయన పుట్టినరోజు సందర్భంగా సిఎం కెసిఆర్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ పంపారు. అయన పుట్టినరోజు కానుక అన్నట్లు నిన్ననే వైద్యకళాశాలకు పాలనాపరమైన అనుమతులు, నిధులు మంజూరవడం మరో విశేషం.