రాజకీయాలలోకి వస్తానంటూ ఊరిస్తున్న తమిళనటుడు రజనీకాంత్ ఇంతవరకు ఆ సాహసం చేయలేకపోతున్నారు కానీ అప్పుడప్పుడు మీడియా సమావేశాలు పెట్టి రాజకీయాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ‘రజనీ ప్రజా వేదిక’ మహిళావిభాగం ఆదివారం చెన్నైలో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన రజనీకాంత్ కర్ణాటక రాజకీయ పరిణామాలపై స్పందించారు. అయన మీడియాతో మాట్లాడుతూ, “కర్ణాటక వ్యవహారంలో గవర్నర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే సుప్రీంకోర్టు దానిని సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. అందుకు సుప్రీంకోర్టుకు నా సలాం. ఎడ్యూరప్పకు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత బలం లేదని గవర్నర్ కు తెలిసి ఉన్నప్పటికీ ఆయనకు 15 రోజులు సమయం ఇవ్వడం నవ్వు తెప్పించింది. దానిని సుప్రీంకోర్టు సవరించించడం చాలా సంతోషం కలిగించింది. ఇది ప్రజాస్వామ్య విజయమే. కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత కావేరీ జలాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని రజనీకాంత్ అన్నారు.