టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం వరంగల్ లో తన పార్టీ కార్యకర్తలకు రాజకీయ శిక్షణా తరగతి నిర్వహించారు. దానిలో అయన మాట్లాడుతూ, “కర్ణాటకలో నెలకొనున్న రాజకీయ పరిస్థితులే మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రజాసేవకోసమే రాజకీయాలు చేయాలి కానీ ఇప్పుడు రాజకీయాలు ఒక వ్యాపారంగా మారిపోయాయి. ఈ పద్దతిని మార్చడానికే తెలంగాణా జనసమితి (టిజెఎస్) ఏర్పాటు చేసుకున్నాము. వచ్చే ఎన్నికలలో మన పార్టీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోకుండా మొత్తం 119 స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తుంది. ఎన్నికలలో తప్పకుండా మనమే గెలిచి అధికారంలోకి వస్తాము. రైతు సమస్యలపై మనం చేసిన విన్నపాలను ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులకు అన్యాయం జరుగుతుంటే మనం చూస్తూ ఊరుకోలేము కనుక మే 30న ఖమ్మం నుంచి కరీంనగర్ వరకు సడక్ బంద్ కార్యక్రమం నిర్వహిస్తాము,” అని చెప్పారు.