వారం రోజులలో ఇద్దరు ముఖ్యమంత్రులు!

May 19, 2018


img

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి మొదలైన రాజకీయ డ్రామాకు సోమవారంతో ముగింపు పడబోతోంది. జెడిఎస్ నేత కుమారస్వామి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో ఒకే రాష్ట్రానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయడం విశేషమే. ఈరోజు సాయంత్రం బెంగళూరులోని హిల్టన్ హోటల్ లో కాంగ్రెస్, జెడిఎస్ పార్టీల ఎమ్మెల్యేలు సమావేశమయ్యి పదవుల పంపకాలను ఖరారు చేసుకున్నారు. కనుక సోమవారం కుమారస్వామితో పాటు రెండు పార్టీలకు చెందిన కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

కుమారస్వామి కీలకమైన ఆర్ధికశాఖను తనవద్దే అట్టేబెట్టుకోబోతున్నట్లు సమాచారం. జి.పరమేశ్వర్ (కాంగ్రెస్) ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లు సమాచారం. ఈరోజు రాత్రి 8.30 గంటలకు బెంగలూరులోని అశోక హోటల్ లో కాంగ్రెస్, జెడిఎస్ సీనియర్ నేతలు మరొకసారి సమావేశమయ్యి, సంకీర్ణ ప్రభుత్వం విధివిధానాలు, ప్రాధాన్యతల గురించి చర్చించబోతున్నారు. సోమవారం జరిగే ప్రమాణస్వీకారానికి దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యనేతలను ఆహ్వానించాలని జెడిఎస్ నిర్ణయించింది. అయితే కుమారస్వామి ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉన్నందున కెసిఆర్, చంద్రబాబు నాయుడు తదితరులు హాజరుకాకపోవచ్చు. 


Related Post