రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కేటిఆర్ శుక్రవారం సచివాలయంలో విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, సిఎం కెసిఆర్, అయన ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ పై ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, “మేము ఏ పార్టీకి ‘ఏ టీం...‘బీ టీం’ కాము. మాది ప్రజల టీం. మేము ప్రజల కోసమే పనిచేస్తాము. వారి కోసమే ఆలోచిస్తాము. చిల్లర రాజకీయాలు చేయవలసిన అవసరం మాకు లేదు. సిఎం కెసిఆర్ కాంగ్రెస్, భాజపాలకు కొరుకుడు పడటం లేదు. ఆయన విషయంలో ఆ రెండు పార్టీలు చాలా తికమకపడుతున్నాయి. అయన రెంటికీ అవకాశం ఇవ్వడం లేదు. కాంగ్రెస్ లౌకికవాదానికి, భాజపా మతతత్వవాదానికి కెసిఆర్ తన ధార్మికపాలన ద్వారా ధీటుగా సమాధానం చెపుతున్నారు. తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఎన్నడూ ఎక్కడా మతకలహాలు జరుగలేదు. హిందూ-ముస్లింలు, ఆంధ్రా-తెలంగాణా అనే భేదం లేకుండా కెసిఆర్ ప్రజలందరినీ కలుపుకుని ముందుకు సాగుతూ తెలంగాణా రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్నారు,” అని కేటిఆర్ అన్నారు.