ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ధర్మదీక్ష పేరుతో ఒక్కరోజు నిరాహారదీక్ష చేస్తున్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాతో సహా విభజన హామీలను అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం మోసం చేసినందుకు నిరసనగా అయన విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఇవ్వాళ్ళ ఒక్కరోజు నిరాహార దీక్షకు కూర్చొన్నారు. సాధారణంగా ఇటువంటి దీక్షలు ఉదయం 10గంటలకు మొదలుపెడుతుంటారు. కానీ చంద్రబాబు నాయుడు ఉదయం 7 గంటలకే వేదిక వద్దకు చేరుకొని దీక్ష ప్రారంభించారు.
అయన దీక్షకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, తెదేపా నేతలు 13 జిల్లాలలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు కూడా దీక్షలు, సైకిల్ ర్యాలీలు చేపడుతున్నాయి.