కాంగ్రెస్ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల శాసనసభ్యత్వాలను పునరుద్దరిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పునసమీక్షించాలని కోరుతూ తెరాస సర్కార్ హైకోర్టు డివిజన్ బెంచిలో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈసారి ఈకేసులో ప్రభుత్వం నేరుగా కలుగజేసుకోకుండా 12 మంది తెరాస ఎమ్మెల్యేల చేత రిట్ పిటిషన్ దాఖలు చేయించింది. శాసనసభ గౌరవం కాపాడటం ముఖ్యం. సభా గౌరవానికి ఎవరు భంగం కలిగించినా ఇటువంటి కటినమైన చర్యలు తీసుకోబడతాయనే బలమైన సంకేతాలు ఇవ్వడం చాలా అవసరం. కనుక ఇద్దరు కాంగ్రెస్ శాసనసభ్యులపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని ఆ రిట్ పిటిషన్ లో కోరినట్లు తెలుస్తోంది. వారి పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
గవర్నర్ నరసింహన్ ఉభయసభల సభ్యులను ఉద్దేశ్యించి శాసనసభలో ప్రసంగిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ శాసనసభ, మండలి సభ్యులు చెలరేగిపోయారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ముఖ్యమంత్రి కెసిఆర్ గురువారం గవర్నర్ తో సమావేశమైనప్పుడు ఈ వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం.