మంత్రి జగదీష్ రెడ్డి టి-కాంగ్రెస్ నేతలకు సూటి ప్రశ్న వేశారు. “వాళ్ళందరూ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకొందామని మాకు సవాళ్ళు విసిరి మళ్ళీ న్యాయస్థానానికి ఎందుకు వెళుతున్నారు? సెమీ ఫైనల్స్ వంటి ఉపఎన్నికలనే ఎదుర్కోవడానికి భయపడుతున్నవారు ఇక ఫైనల్స్ వంటి 2019 ఎన్నికలను ఏవిధంగా ఎదుర్కోగలరు? 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. అప్పుడు శాసనసభలో కేవలం తెరాస, మజ్లీస్ పార్టీలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షాలు లేని శాసనసభ మాకు కూడా కాస్త బోరింగ్ గానే ఉంటుంది కానీ భరించకతప్పదు. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నాయి. నిజానికిది ఇది రైతు బడ్జెట్. ఇది యావత్ దేశానికే తలమానికంగా నిలువబోతోంది,” అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.