హైదరాబాద్ నగరం జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలవడం మన అందరికీ గర్వకారణం. ఈ సదస్సుల వలన హైదరాబాద్, తెలంగాణా రాష్ట్ర పేరు ప్రతిష్టలు దశదిశలా వ్యాపించడమేకాక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు, పెట్టుబడులు కూడా వస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణగా నిన్నటితో ముగిసిన ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సులో విప్రో సంస్థతో జరిగిన ఒప్పందం ద్వారా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రూ.200 కోట్ల పెట్టుబడితో సబ్బులు, సౌందర్య సాధనల పరిశ్రమ స్థాపించబడుతోంది.
ప్రపంచ ఐటి కాంగ్రెస్ సదస్సు ముగియగానే నేటి నుంచి బయో ఆసియా సదస్సులు ప్రారంభం అయ్యాయి. గత 14 ఏళ్ళుగా నిర్వహించబడుతున్న ఈ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ శాశ్వితవేదికగా నిలవడం మరో విశేషం. వరుసగా 15వసారి మళ్ళీ హైదరాబాద్ లో ఈ సదస్సు జరుగుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ దీనిని ప్రారంభించబోతున్నారు. మూడురోజుల పాటుసాగే ఈ సదస్సులో భారత్ తో సహా 60 దేశాలకు చెందిన 2,000 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో సుల్తాన్ పూర్ వద్ద ఏర్పాటు చేస్తున్న మెడికల్ పార్క్ లో పరిశ్రమల స్థాపనకు ఈ సదస్సు దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.