ఇటీవల హైదరాబాద్ లో రెండు రోజులపాటు జరిగిన మైనింగ్ టుడే సదస్సులో సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ ప్రధమ బహుమతి దక్కించుకొంది. ఈ సదస్సు ముగింపు వేడుకలలో పాల్గొన్న మంత్రులు జగదీశ్ రెడ్డి, జోగు రామన్న చేతుల మీదుగా సింగరేణి జనరల్ మేనేజర్ అంథోని రాజ్ ఈ అవార్డును అందుకొన్నారు.
సింగరేణిలో బొగ్గు త్రవ్వకాలకు, రవాణాకు ఎటువంటి యంత్రాలను, పరికరాలను ఉపయోగిస్తారో, ఎటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారనే విషయాలు సామాన్య ప్రజలకు తెలిసే అవకాశం ఉండదు. కనుక ఈ మైనింగ్ టుడే సదస్సులో సింగరేణి సంస్థ వాటిని కళ్ళకు కట్టినట్లు చూపే విధంగా ఒక స్టాల్ ను ఏర్పాటు చేసింది. దానిలో బొగ్గు గనులలో వర్కింగ్ మోడల్స్, రకరకాల మైనింగ్ వాల్స్, గనులలోకి కార్మికులు వెళ్ళి వచ్చేందుకు ఉపయోగించే వాహనాలు, బొగ్గును వెలికితీసే యంత్రాలు, ఓబీ ప్లాంట్ తదితర మోడల్స్ అందరినీ ఆకట్టుకొన్నాయి.