తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రానికి వచ్చిన కోవిడ్ వ్యాక్సిన్లను ముందుగా ఫ్రంట్లైన్ వారియర్స్(ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది)కి ఇవ్వనున్నామని తెలిపారు. అన్ని జిల్లాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ వ్యాక్సిన్ పడినట్లయితే తొందరగా చర్యలు చేపట్టేలా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలలో ప్రతీ వ్యాక్సిన్ కేంద్రం వద్ద పర్యవేక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక్కో అధికారిని నియమించనున్నామని తెలిపారు. అన్ని జిల్లాలో కేంద్రాల వద్ద అవసరమైతే చికిత్స చేసేందుకుగాను వైద్య సిబ్బందిని, మందులను అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ టీకా తీసుకున్నవారిని కనీసం అర్ధగంటసేపు పర్యవేక్షణలో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనించాలని ఆదేశించారు. ఒకవేళ టీకా తీసుకొన్న తరువాత ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యసిబ్బంది వారిని పరీక్షించి అవసరమైన చికిత్స అందజేయాలన్నారు. కోవిడ్ టీకాల కార్యక్రమం పూర్తయ్యేవరకు అధికారులు, సిబ్బంది అందరూ పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.