త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవబోతున్నందున ప్రధాని నరేంద్రమోడీ సోమవారం అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తూనే, వారికి ఆయన కూడా కొన్ని ముఖ్య సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.
పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవీషీల్డ్, హైదరాబాద్లోని భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన కోవాక్సిన్ల అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతించిన తరువాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ముఖ్యమంత్రులతో నేడు సమావేశమవుతున్నారు. ఈనెల 12వ తేదీన పూణే నుంచి రాష్ట్రానికి కరోనా వాక్సిన్లు వస్తాయని కనుక 16వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా వాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.