కరోనా వైరస్ సోకకుండా నివారించేందుకు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసిన ‘కొవాక్సిన్’ టీకాకు తొలి రెండు దశల ప్రయోగాలు విజయవంతంగా పూర్తవడంతో,అత్యంత కీలకమైన 3వ దశ క్లినికల్ ట్రయల్స్కు ఐసీఎంఆర్ అనుమతించింది. కనుక ఈ వారంలోనే హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రిలో 3వ దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ముందుగా నీమ్స్ ఎథిక్స్ కమిటీ మంగళవారం సమావేశమయ్యి వీటికి సంబందించిన అంశాలపై చర్చించి ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత క్లినికల్ ట్రయల్స్ మొదలవుతాయి.
వీటిలో భాగంగా మొదట 100-200 మంది వాలంటీర్లకు కొవాక్సిన్ ఇచ్చి పరీక్షిస్తారు. ఆ తరువాత మళ్ళీ మరికొంతమందికి వ్యాక్సిన్ ఇచ్చి వారి ఆరోగ్యపరిస్థితిని పరిశీలిస్తారు. ఈవిధంగా డిసెంబర్ నెలాఖరు వరకు వందలాదిమంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహిస్తారు. అవన్నీ విజయవంతమైతే ఫిబ్రవరినెలాఖరులోగా అనుమతులు తీసుకొని కొవాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.