ప్రాణం మీదకు తెచ్చిన నాటు వైద్యం

June 22, 2018
img

నేడు ఏ టీవీ ఛానల్ పెట్టినా షుగర్, బీపి, కీళ్ళనొప్పులు, అజీర్తి మొదలైన దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద మందులతో శాశ్విత పరిష్కారం చేస్తామని ప్రకటనలు కనిపిస్తుంటాయి. సదర్ సంస్థలు ప్రముఖ నటీనటులతో ఆ ప్రకటనలు చేయిస్తుండటం వలన చాలామంది ప్రజలు వారిపై నమ్మకంతో సదరు ఆయుర్వేద ఉత్పత్తులను కొనుగోలుచేసి ఉపయోగిస్తుంటారు. అయితే వాటిని ఉపయోగిస్తే ఉన్న జబ్బులు తగ్గకపోగా కొందరు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మేనకోడలు అలివేలు (45) అందుకు తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 

ఆమెకు చిరకాలంగా షుగర్ వ్యాధి ఉంది. దాని కోసం ఆమె మందులు కూడా వాడుతున్నారు. అయితే షుగర్ వ్యాధిని శాశ్వితంగా నయం చేస్తామని టీవీలో వచ్చిన ఒక ప్రకటన చూసి, ఆ సంస్థ నుంచి ఆయుర్వేద తైలాన్ని కొని ఆమె వాడటం మొదలుపెట్టారు. అది వాడుతున్నప్పుడు షుగర్ వ్యాధికి వేరే మందులు ఏవీ వాడకూడదని సదరు సంస్థ చెప్పడంతో ఆమె వాటిని మానేసి ఆ సంస్థ పంపిన ఆయుర్వేద తైలాన్ని మాత్రమే రోజూ త్రాగుతున్నారు. 

దాని వలన షుగర్ తగ్గకపోగా నిన్న హటాత్తుగా వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. క్షణాలలోనే ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డారు. ఆమె షుగర్ మందులు మానేయడం వలన ఆమె షుగర్ లెవెల్స్ 450 కు చేరుకున్నట్లు నీమ్స్ వైద్యులు చెప్పారు. తక్షణం వైద్య సహాయం అందించడంతో ఆమె కోలుకొంటున్నారని చెప్పారు. ఈ సంగతి తెలుసుకొని కడియం శ్రీహరి ఆసుపత్రికి చేరుకొని ఆమెను పరామర్శించారు. 

లోకంలో అన్ని విషయాల గురించి గొప్పగా తమ అభిప్రాయలు చెప్పే మన టీవీ ఛానల్స్ తమ వ్యాపారం కోసం ఇటువంటి నకిలీ మందుల ప్రకటనలను, ఉంగరాలు, తాయెత్తులు, లాకెట్ల ప్రకటనలను ప్రసారం చేస్తుంటాయి. వాటిని నిషేధించవలసిన ప్రభుత్వమూ, పోలీసులు కూడా పట్టించుకోరు. ఆ కారణంగా ఏటా లక్షలాది మంది ప్రజలు ఈవిధంగా నష్టపోతుంటారు. కనీసం ఇప్పుడైనా మీడియాలో అటువంటి ప్రకటనలను నిషేదిస్తే ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది.

Related Post