రేయనక పగలనకా కష్టపడి పంటలు పండించే అన్నదాతలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బహుశః దేశంలో మరే రంగంలోను లేని కష్టం, నష్టం అంతా వ్యవసాయరంగంలోనే ఉందనిపిస్తుంది వారి కష్టాలు చూస్తుంటే. ఆర్ధిక సమస్యలతో సతమతమవుతున్న రైతులలో కొంతమంది తమ లేదా తమ కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారనే వార్తలలో చూస్తూనే ఉన్నాము.
ఈ సమస్యకు పరిష్కారంగా ఖమ్మం జిల్లాలో రైతులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా 50 శాతం రాయితీపై వైద్య సౌకర్యం కల్పించేందుకు జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీ రైతుల ట్రస్ట్ అధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రూ.8 కోట్లు వ్యయంతో 100 పడకల స్టార్ ఆసుపత్రి ఈనెల 17న ప్రాంభించబోతున్నట్లు ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ మువ్వా విజయ్ బాబు తెలిపారు. దీని కోసం జిల్లాలోని రైతు సహకార సంఘాలలో రైతులందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. రైతుల కోసమే రైతు సంఘాలే ఏర్పాటు చేసుకొంటున్న మొట్టమొదటి ఆసుపత్రియిదని చెప్పారు.