దేశంలో అన్ని రాష్ట్రాలలో బోదకాలు రోగులున్నారు. వారి బాధలు వర్ణనాతీతం. పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మూడు నాలుగు రెట్లు ఉబ్బిపోయిన కాలితో ఏ పని చేయలేని నిస్సహాయులుగా మిగిలిపోతారు. అదిగాక సమాజం కూడా వారిని చూసి ఈసడించుకొంటుంది. ఒకపక్క కాలి బాధ, మరోపక్క ఏపని చేసుకొని పొట్ట పోసుకోలేని నిసహాయత, సమాజం ఈసడింపులు. బోధకాలు రోగులు మౌనంగా ఆ నరకం అనుభవిస్తూ భారంగా జీవితాలు గడిపేస్తుంటారు.
తెరాస ఎంపి కవిత వారి సమస్యలను ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళి వారిని ఆడుకోవలసిందిగా కోరగా అయన వెంటనే వారికి కూడా నెలనెలా రూ.1,000 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ముందుగా రాష్ట్రంలో బోధకాలు రోగులు ఎంతమంది ఉన్నారో సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ నుంచి వారందరికీ పెన్షన్లు మంజూరు చేద్దామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. అంతేకాదు..ఈ వ్యాధి సోకినవారికి ఉచితంగా పరీక్షలు, మందులు అందించాలని అధికారులను ఆదేశించారు.