ఈరోజు సిఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మంత్రివర్గసమావేశం జరిగింది. ఆ సమావేశంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్లు, ఉన్నతశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. పాఠశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో లోతుగా చర్చించిన తరువాత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9 మరియు 10 తరగతులను పునః ప్రారంభించాలని సిఎం కేసీఆర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష( టెట్) నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలలో సీనియరిటీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని జిల్లాలలో జనాభాకు తగ్గట్టు సమీకృత మార్కెట్ భవనాలను నిర్మించాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణీ పోర్టల్లో సాఫ్ట్వేర్లో అవసరమైన మార్పులు చేసి వారం రోజులలోగా అన్ని సమస్యలను పరిష్కరించాలని సిఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.