భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరీక్షలను దసరా వరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈనెల 21 నుంచి 23 వరకు జరుగవలసిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూ ప్రకటించింది. వాటిని ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూనివర్సిటీలు పరీక్షలను వాయిదావేశాయి.
హైదరాబాద్తో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఇళ్ళలోకి వరదనీరు చేరడంతో చాలా మంది విద్యార్దుల సర్టిఫికేట్లు తడిసిపాడైపోయాయని తెలిసిందని, కనుక వారందరికీ కొత్తవి లేదా సర్టిఫికేట్ల నకలు జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. విద్యార్దులు స్వయంగా సదరు బోర్డు కార్యాలయాలకు వెళ్ళి దరఖాస్తు సమర్పించవచ్చని లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్నా కొత్తవి లేదా సర్టిఫికేట్ల నకలు విద్యార్దులకు అందజేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.