తెలంగాణ వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న 194 వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది కానీ వాటిని ప్రభుత్వ పరమ్గా కాక అవుట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం అమలుచేసేందుకు జరుగుతున ప్రయత్నాలలో భాగంగా రాష్ట్రంలో సాగుభూమిని 2,638 క్లస్టర్లుగా విభజించి, ఒక్కో క్లస్టరుకు ఒక్కో ఏఈఓ చొప్పున 2,444 మందిని భర్తీ చేశాము. మిగిలిన 194 క్లస్టర్లకు 194 మంది ఏఈఓలను త్వరలోనే భర్తీ చేయబోతున్నాము. ఆ క్లస్టర్లలో ఎప్పుడు ఏ రకం పంటలు ఏమేరకు వేయాలో రైతులకు తెలియజేస్తూ ఏఈఓలు వారికి అన్ని విధాలా తోడ్పడుతుంటారు. ఈ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాము. కొంత కాలం తరువాత శాస్విత ప్రాతిపదికన ఏఈఓలను భర్తీ చేస్తాము. అప్పటి వరకు అవుట్ సోర్సింగ్ పద్దతిలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసి సమగ్ర వ్యవసాయ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించాము,” అని అన్నారు.