లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఇంటర్మీడియెట్ రెండవ సంవత్సర పరీక్షలను జూన్ 3న నిర్వహించబోతున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆరోజున జాగ్రఫీ, మోడ్రన్ లాంగ్వేజీ పరీక్షలు నిర్వహిస్తారు. ఇదివరకు జారీ చేసిన హాల్ టికెట్లతోనే ఈ పరీక్షలకు హాజరుకావచ్చునని ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షా పత్రాల మూల్యాంకనం నేటి నుంచి అబీడ్స్లో గల మహబూబియా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రారంభం అయ్యింది. కరోనా నేపధ్యంలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి హాజరైన లెక్చరర్లు భౌతికదూరం పాటించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో గదిలో 15 మంది చొప్పున మొత్తం 350 మంది లెక్చరర్లు జవాబు పత్రాలను దిద్దారు. ఒక్కో లెక్చరర్ 45 పత్రాలను దిద్దారు. అబీడ్స్లోని సెయింట్ జార్జ్, సుజాత జూనియర్ కాలేజీలలో కూడా బుదవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షా పత్రాల మూల్యాంకనం మొదలైంది. జూన్ మొదటి వారంలోగా మూల్యాంకనం పూర్తి చేసి రెండవ వారంలో ఫలితాలను ప్రకటించాలని ఇంటర్మీడియెట్ బోర్డు భావిస్తోంది.