తెలంగాణ రాష్ట్రంలో గురువారం నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. కరోనా వైరస్ నేపధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహిస్తున్నామని సిఎం కేసీఆర్ చెప్పి 24 గంటలు గడువక మునుపే, పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఆదేశించింది. పరీక్షలకు హాజరవుతున్న 5 లక్షల మంది విద్యార్ధుల శ్రేయస్సు దృష్ట్యా పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఓ ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. దానిపై వెంటనే విచారణ చేపట్టిన హైకోర్టు శనివారం ఒక్కరోజు జరుగబోయే పరీక్షను నిర్వహించి ఈనెల 30 వరకు నిర్వహించాల్సిన మిగిలిన అన్ని పరీక్షలను వాయిదావేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6వరకు జరుగబోయే పరీక్షలపై కూడా పరిస్థితులను సమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పదవ తరగతి పరీక్షల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వానికి, పరీక్షలకు సిద్దమైన విద్యార్ధులకు అందరికీ కూడ ఇది చాలా ఇబ్బందికరమే కానీ కరోనా ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఇటువంటి ఇబ్బందులు భరించకతప్పదు.