హైదరాబాద్కు పోటీగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరానికి త్వరలో మరో ఐటి కంపెనీ రానుంది. మడికొండలో ఏర్పాటు చేసిన ఐటిపార్కులో ఈనెల 16న క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఐటి కంపెనీ భవనానికి శంఖుస్థాపన జరుగబోతోంది. ఈ ఏడాదిలోపుగా భవన నిర్మాణం పూర్తిచేసి ఉద్యోగులను భర్తీ చేసుకొని సంస్థ కార్యక్రమాలు ప్రారంభించబోతునట్లు తెలుస్తోంది. ఇప్పటికే మడికొండ ఐటిపార్కులో టెక్ మహీంద్రా, సైయంట్ ఐటి కంపెనీలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. త్వరలో మైండ్ ట్రీ ఐటి కంపెనీ కూడా మడికొండకు రాబోతోంది. వరంగల్లో ఐటి కంపెనీలు ఏర్పాటైతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో సహ చుట్టుపక్కల జిల్లాలలోని యువత ఉద్యోగాల కోసం ఇక హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం ఉండదు. దీని వలన హైదరాబాద్పై ఒత్తిడి తగ్గడమే కాకుండా అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి.