ఉన్నత విద్యలు అభ్యసించాలనుకుంటున్న తెలంగాణ విద్యార్దులకు ఓ శుభవార్త. సంగారెడ్డిలో ఏర్పాటవుతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లో ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్దులతో తొలి బ్యాచ్ శిక్షణా తరగతులు మొదలుపెట్టాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది.
నిజానికి ఈ ఐఐఐటీ కర్ణాటకలోని రాయచూర్లో ఏర్పాటు చేయాలనుకొంది. కానీ కర్ణాటక ప్రభుత్వం ఐఐఐటీ ఏర్పాటుకు అవసరమైన భూమి, మౌలికవసతులు కల్పించకపోవడంతో వెంటనే తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి రాష్ట్రంలో దానిని ఏర్పాటు చేయవలసిందిగా కేంద్రాని కోరింది. దాని కోసం వెంటనే సంగారెడ్డిలో రెండు ఎకరాల భూమి, తాత్కాలిక భవనాలను కూడా కేటాయించడంతో తెలంగాణలోనే తాత్కాలికంగా ఐఐఐటీని ఏర్పాటుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించి ప్రవేశాల ప్రక్రియ కూడా ప్రారంభించింది. సంగారెడ్డి నుంచి మళ్ళీ కర్ణాటకకు వెళ్లిపోకుండా కాపాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.