ఇంటర్ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న హైకోర్టు, రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేసిన విద్యార్దుల పరీక్షాపత్రాలను, ఇంటర్ ఫలితాలను ఒకేసారి ప్రకటించాలని ఇంటర్ బోర్డును ఆదేశించడంతో గురువారం విడుదల కావలసిన ఫలితాలు మే 27వ తేదీకి వాయిదా పడినట్లే భావించవచ్చు. రేపు ఇంటర్ ఫలితాలు ప్రకటించడానికి సిద్దంగా ఉన్నామని ఇంటర్ బోర్డు చెప్పినప్పటికీ పరీక్షాపత్రాలను ఎప్పుడు ఆన్లైన్లో ఉంచగలరో అప్పుడే ఫలితాలను కూడా ప్రకటించాలని ఆదేశించింది. ఇంటర్ పరీక్షా ఫలితాలలో జరిగిన అవకతవకలపై వివరణ ఇవ్వాలని కోరుతూ హైకోర్టు గ్లోబరీనా సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.
ఇంటర్ ఫలితాలలో ఏర్పడిన గందరగోళం కారణంగా ఇప్పటికే విద్యార్దులు, వారి తల్లితండ్రులు కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. ఇప్పుడు మే 27వరకు ఫలితాలు వెల్లడించకపోతే వారి ఆందోళన ఇంకా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వివిద ప్రవేశపరీక్షలకు హాజరవ్వాలనుకొంటున్న విద్యార్దులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.