ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇంచుమించు ఒకేసమయంలో జరిగాయి. ఏపీ ఇంటర్ ఫలితాలు శుక్రవారం వచ్చేశాయి కానీ తెలంగాణ బోర్డ్ ఇంతవరకు ఫలితాలు ప్రకటించలేదు. పరీక్షాపత్రాల మూల్యాంకనం చేసిన తరువాత మార్కుల జాబితాలను కంప్యూటర్లోకి ఎక్కించవలసి ఉంటుంది. ఈసారి ఆ బాధ్యతను అనుభవం లేని ఒక కొత్త సంస్థకు అప్పగించడం వలన ఇంతవరకు ఆ పని పూర్తి కాలేదని, అందుకే ఫలితాల వెల్లడిలో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఎంసెట్ తదితర ప్రవేశపరీక్షలకు సిద్దం కావలసి ఉంటుంది కనుక విద్యార్ధులు వారి తల్లితండ్రులు ఇంటర్ ఫలితాల కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయో ఇంటర్ బోర్డు అధికారులు చెప్పలేకపోతున్నారు. దీంతో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. కనుక ఫలితాలు ఎప్పట్లోగా ప్రకటిస్తారో ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడిస్తే బాగుంటుంది.