ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్పై ఈరోజు శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొన్న సిఎం కేసీఆర్, లోక్సభ ఎన్నికల తరువాతే నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగుల సంఖ్య, ఈ పధకం అమలుకు విధివిధానాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోందని, ఈ పనులన్నీ పూర్తయేందుకు మరో 2-3 నెలలు పట్టవచ్చు కనుక లోక్సభ ఎన్నికల తరువాతే నిరుద్యోగ భృతి ఇస్తామని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇవ్వడంతో తెరాస కూడా హామీ ఇవ్వవలసి వచ్చింది. అందుకు అనుగుణంగా బడ్జెట్లో రూ.1,810 కోట్లు కేటాయించడంతో త్వరలోనే ఈ పధకం ప్రారంభం అవుతుందని రాష్ట్రంలో నిరుద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ మరో 2-3 నెలల వరకు ఇది అమలయ్యే అవకాశం లేదని సిఎం కేసీఆర్ స్వయంగా నేడు స్పష్టం చేయడంతో నిరుద్యోగులకు తీవ్ర నిరాశ చెందుతారు.