తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిషిప్ కోసం ఈ నెల 7వ తేదీన ముషీరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్దగల ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 గంటలవరకు అప్రెంటిస్ మేళా నిర్వహించబోతున్నట్లు కూకట్పల్లి ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ దేవదానం తెలియజేశారు. మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ లో ఐటిఐ పూర్తి చేసిన విద్యార్ధులు ఈ మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. ఐటిఐ పూర్తి చేసిన విద్యార్ధులు ఏదైనా ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థలో ఏడాదిపాటు విధిగా అప్రెంటిషిప్ కూడా చేయవలసి ఉంటుంది. అప్పుడే వారికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాలకు ప్రాధమిక అర్హత పొందుతారు.సాధారణంగా ఏదైనా సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పుడు ఆ సంస్థలో అప్రెంటిషిప్ చేసినవారికే తొలి ప్రాధాన్యం లభిస్తుంటుంది. ఐటిఐ పూర్తి చేసిన విద్యార్ధులలో చాలామందికి ఈవిషయం తెలియక ఏదో ఓ చిన్న ఉద్యోగం దొరికితే దానిలో చేరిపోతుంటారు. కనుక వారు ఈ అవకాశాన్ని వినియోగించుకొంటే మంచిది.