రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో అనేక సం.లుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో కొత్తగా గెస్ట్ లెక్చరర్ల నియామకాలలో తమకు ఎటువంటి ప్రాధాన్యతను కల్పించకపోవడాన్ని సవాలు చేస్తూ వారు వేసిన పిటిషనుపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు వారి పిటిషనును కొట్టివేశారు. అయితే వారు ఈ విద్యా సంవత్సరంలో గెస్ట్ లెక్చరర్ గా ఎంపిక కాకపోయినట్లయితే, ఎందువలన తమను ఉద్యోగాలలోకి తీసుకోలేదో తెలుపమని ఇంటర్ బోర్డుకు కమీషనర్ ను ప్రశ్నించవచ్చని, వారికి మూడు వారాలలోగా సమాధానం ఈయవలసి ఉంటుందని జస్టిస్ నవీన్ రావు చెప్పారు.
చిరకాలంగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లు తమకు ప్రాధాన్యత ఈయాలని కోరుకోవడం సహజమే కానీ ఆ కారణంగా కొత్తవారెవరికి అవకాశాలు కల్పించలేకపోతే వారు కూడా ఈ నియామకాల ప్రక్రియను సవాలు చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. కనుక పాత, కొత్తవారికి సమానావకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది కనుకనే ఇంటర్మీడియెట్ బోర్డు ఆవిధంగా విధివిధానాలు రూపొందించిందని చెప్పవచ్చు.