గత ఏడాది డిసెంబర్ లో హైదరాబాద్ నగరంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడే రాష్ట్రంలో తెలుగు బాషాభివృద్ధికి గట్టి చర్యలు తీసుకొంటామని ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకొంటూ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో 10వ తరగతి వరకు తెలుగుబాషను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది. కనుక వేసవి సెలవులు ముగిసి మళ్ళీ పాఠశాలలు తెరిచేసరికి ప్రాధమిక స్థాయి నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతులకు తెలుగు సబ్జెక్ట్ సిలబస్ తయారుచేసి తదనుగుణంగా పాఠ్యపుస్తకాలను ముద్రించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.