కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నేడు మరో ముఖ్యమైన ఘటన నమోదు కాబోతోంది. ఆ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నేడు నామినేషన్ వేయబోతున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, ఏకె అంటోనీ, అహ్మద్ పటేల్ తదితర సీనియర్ కాంగ్రెస్ నేతలు ఈ నామినేషన్స్ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు.
నామినేషన్స్ వేయడానికి నేడే చివరి రోజు కానీ ఇంత వరకు పార్టీలో వేరే ఎవరూ నామినేషన్స్ వేయలేదు. ఈరోజు సాయంత్రంలోగా మరెవరూ నామినేషన్స్ వేయకపోతే రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికయినట్లే లెక్క. ఒకవేళ ఎవరైనా నామినేషన్ వేసినట్లయితే, ఈ నెల 17వ తేదీన అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించి, 19వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు.
నామినేషన్స్ చివరి రోజైన ఈరోజు వరకు పార్టీలో ఎవరూ నామినేషన్స్ దాఖలు చేయలేదు కనుక ఇక ఎవరూ రాహుల్ గాంధీపై పోటీ చేయబోరనే భావించవచ్చు. బహుశః అందుకే రాహుల్ గాంధీ చివరి రోజు వరకు వేచి చూసినట్లున్నారు. కనుక రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం లాంచనప్రాయమేనని భావించవచ్చు.
అయితే బొత్తిగా నాయకత్వ లక్షణాలు లేవని విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ, గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగి దేశాన్ని ప్రగతి పధంలో నడిపిస్తూ గొప్ప నాయకుడిగా ఎదిగిన ప్రధాని నరేంద్ర మోడీని డ్డీ కొనగలరా? నానాటికీ బలపడుతున్న భాజపాను ఎన్నికలలో ఎదుర్కొని విజయం సాధించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చిపెట్టగలరా? అనే ప్రశ్నలకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే సమాధానాలు చెప్పబోతున్నాయి.