హైదరాబాద్ లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సుకు ఏపి సిఎం చంద్రబాబు నాయుడుకు ఆహ్వానం అందాకపోవడం విచిత్రమే. ఆయనకు ఆహ్వానం అందనప్పటికీ ఆయన కోడలు బ్రాహ్మణికి ఆహ్వానం రావడం విశేషం. ఆమె హెరిటేజ్ డెయిరీ బాధ్యతలను చూస్తున్న సంగతి తెలిసిందే. ఆమెతో బాటు ప్రముఖ నటుడు రామ్ చరణ్ తేజ్ భార్య, అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాపరెడ్డి మనుమరాలు ఉపాసన, ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి కూడా ఈ సదస్సులో జరుగుతున్న చర్చలలో చురుకుగా పాల్గొన్నారు. ముగ్గురూ తమ ఆలోచనలను, అభిప్రాయాలను సాటి మహిళా పారిశ్రామికవేత్తలతో పంచుకొన్నారు. తరువాత ముగ్గురూ సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించి వివిధ రంగాలలో వస్తున్న మార్పులు, కొత్త కొత్త ఆవిష్కరణల గురించి అడిగి తెలుసుకొన్నారు. వారిలో ఉపాసన ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశాలపై ఆసక్తి చూపగా, మంచు లక్ష్మి ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విషయలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. మంచు లక్ష్మి నేరుగా సినీ రంగంలోనే పనిచేస్తుండగా, భర్త రామ్ చరణ్, మావగారు చిరంజీవి కారణంగా ఉపాసనకు సినీ పరిశ్రమ గురించి మంచి అవగాహన ఏర్పడింది.