ఎల్ అండ్ టి సంస్థ మెట్రో రైల్ టికెట్ ఛార్జీలను ప్రకటించింది. టికెట్ కనీస ధర రూ.10, గరిష్ట ధర రూ.60గా నిర్ణయించింది. మొదటి 2 కిమీకు రూ.10, 2 నుంచి 4 కిమీకు రూ.15, 4 నుంచి 6 కిమీ దూరానికి రూ.25, 6 నుంచి 8 కిమీకు రూ.30, 8 నుంచి 10 కిమీ దూరం వరకు రూ.35 గా నిర్ణయించారు. మియాపూర్ నుంచి నాగోల్ కు టికెట్ ధర గరిష్టంగానిర్ణయించిన రూ.60లుగా భావించవలసి ఉంటుంది. మెట్రో రైల్ ఏర్పాటు కోసం పెట్టిన పెట్టుబడి, నిర్వహణ వ్యయాలు రాబట్టుకోవడానికి ఈమాత్రం ధరలు అవసరమే. మెట్రో అందిస్తున్న ఆధునిక సౌకర్యాలు, సేవలు, వేగంగా గమ్యం చేరుకోగలిగే అవకాశం వంటివాటిని కూడా పరిగణనలోకి తీసుకొన్నట్లయితే ఈ ధరలు సమంజసంగానే ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఈ టికెట్ ఛార్జీలు కాస్త భారమనే చెప్పకతప్పదు. పైగా మొదట్లోనే ఇంత ఎక్కువ ధరలు ప్రకటించడం చేత మున్ముందు అవి ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గే అవకాశం లేదని భావించవలసి ఉంటుంది. కనుక టికెట్ చార్జీలపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకమానవు.