బసవ జయంతి సందర్భంగా శనివారం డిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ అంశాన్ని ఒక సామాజిక సమస్యగా మాత్రమే చూడాలి తప్ప దానిని రాజకీయ కోణంలో చూడరాదని అన్నారు. ట్రిపుల్ తలాక్ కారణంగా దేశంలో ఎంతో మంది ముస్లిం మహిళల జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలకు కూడా సమానహక్కులు కల్పించడం చాలా అవసరం. కనుక ముస్లిం మతపెద్దలు ఇటువంటి చెడువిధానాల వలన ముస్లిం మహిళలు నష్టపోకుండా వారిని కాపాడుకొనేందుకు సంస్కరణలకు సహకరించాలి,” అని అన్నారు.
అది ప్రధాని వ్యక్తిగత విషయమే కావచ్చు కానీ ఆయన ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ వలన జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు, అయన అర్ధాంగి యశోద బెన్ కు జరిగిన అన్యాయం గుర్తుకురావడం సహజం. మోడీ తన మాతృమూర్తిని, దేశంలో అన్ని మతాల మహిళలను గౌరవిస్తున్నప్పుడు, అందరూ గౌరవించాలని చెపుతున్నప్పుడు, ఎవరికీ అన్యాయం జరగకూడదని కోరుకొంటున్నప్పుడు తన అర్ధాంగిని కూడా వారిలో ఒకరిగానే భావించి ఆమెకు న్యాయం చేసి ఉండి ఉంటే అయన గౌరవం మరింత పెరిగి ఉండేది కదా..అనిపిస్తుంది.
విచిత్రమైన విషయం ఏమిటంటే, ట్రిపుల్ తలాక్ విషయంలో కలుగజేసుకొని ముస్లిం మహిళలకు అండగా నిలబడాలనే ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న భాజపా నేతలు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.