ముస్లింలకు 12శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. దాదాపు మూడేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు దాని కోసం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టలేదు. అందుకు అనేక కారణాలు, సంజాయిషీలు చెప్పవచ్చు. ఇప్పుడు కాకపోతే మరొక 6నెలలో..ఏడాది తరువాతైన తెరాస సర్కార్ ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టవచ్చు.
అయితే ఆ బిల్లు కూడా ఏపిలో ప్రత్యేక హోదా అంశంలాగే తయారవడం ఖాయం. ప్రత్యేక హోదా వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఏ ప్రయోజనం కలుగకపోయినా అది ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా ఉపయోగపడుతోంది. అదేవిధంగా ఈ ముస్లిం రిజర్వేషన్ బిల్లు వలన ముస్లింల కంటే తెరాస, భాజపాలకే ఎక్కువ ప్రయోజనం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి.
ఒకవేళ వచ్చే ఎన్నికలలో భాజపా-తెరాసలు పొత్తులు పెట్టుకోకపోతే, ఈ బిల్లునే భాజపా పైకి బ్రహ్మాస్త్రంలాగ ప్రయోగించవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే తమ ప్రయత్నానికి కేంద్రప్రభుత్వం (భాజపా) సహకరించలేదని చెప్పుకొని ముస్లిం ప్రజల ఓట్లు సంపాదించుకోవచ్చు.
ఈ బిల్లు మరో ప్రత్యేకత ఏమిటంటే భాజపాతో సహా అన్ని పార్టీలకు కూడా ఉపయోగించుకొనే వెసులుబాటు ఉండటమే. ముస్లింలకు రిజర్వేషన్లను 12శాతానికి పెంచినట్లయితే తమకు నష్టం కలుగుతుందని భయపడుతున్న కొన్ని కులాల ప్రజలను భాజపా ఆకర్షించగలదు. ఆ బిల్లును అడ్డుకొన్నామని చెప్పి భాజపా హిందూ ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేయవచ్చు. భాజపాను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ తన సెక్యులర్ సర్టిఫికేట్ ను ప్రదర్శించుకోగలదు. వామపక్షాలు ఇప్పటికే ఆ పని చేస్తున్నాయి. మిగిలిన పార్టీలు కూడా వాడేసుకొని దానితో ఎంతో కొంత రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేయవచ్చు. కనుక ముస్లిం రిజర్వేషన్ బిల్లు వలన ముస్లింల కంటే రాజకీయ పార్టీలకే ఎక్కువ ఉపయోగపడవచ్చు.