భాజపాకి అదే పెద్ద సమస్య

April 10, 2017


img

దేశంలో అన్ని కులమతాలు, ప్రాంతాల ప్రజలు తమకు భాజపా సమానమేనని చెపుతుంటుంది కానీ ఎప్పుడూ ‘హిందూ ఓటు బ్యాంక్ రాజకీయాలు’ చేయకుండా నిగ్రహించుకోలేరు. అయోధ్యలో రామాలయం నిర్మించి తీరుతామని ఎవరైనా అడ్డువస్తే తలలు నరుకుతామని గోషామహల్ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యూపిలో హిందుత్వవాది అయిన ఆదిత్యనాథ్ యోగి ముఖ్యమంత్రిగా ఉన్నారని కనుక అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగడం తద్యం అని దానిని ఎవరూ అడ్డుకోలేరని, అడ్డుకొంటే తలలు నరుకుతామని రాజా సింగ్ హెచ్చరించారు. శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ లో మొన్న నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్నప్పుడు రాజా సింగ్ ఈ మాటలన్నారు. ఆయన ఒక వర్గం ప్రజలను భయబ్రాంతులను చేసేవిధంగా మాట్లాడారని ఆరోపిస్తూ పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తి హైదరాబాద్ డబ్బీర్‌పుర పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఎమ్మెల్యేలు, ఎంపిలు ప్రమాణస్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూస్తామని భగవంతుడిపై ప్రమాణం చేస్తుంటారు. కానీ ఆ తరువాత ఈవిధంగా మాట్లాడుతుంటారు. ఇటువంటి మాటల వలన అటు తమ స్వంత పార్టీకి, ప్రభుత్వానికి కొత్త సమస్యలను సృష్టించడమే కాకుండా ప్రజల మద్య చిచ్చు రగిలించి సమాజంలో ప్రశాంతతకు భంగం కలిగిస్తుంటారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం గురించి, సంబంధిత వర్గాలు చర్చిస్తున్నప్పుడు, ఆ కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్నప్పుడు అందరూ డానికి కట్టుబడి ఉండాలి. కానీ సాక్షాత్ ప్రజాప్రతినిధులే ఈవిధంగా మాట్లాడటం చాలా తప్పు. భాజపాకు ఇష్టమున్నా లేకున్నా భారత్ ఎప్పుడు లౌకికవాదానికే కట్టుబడి ఉంటుందని భాజపా నేతలు గ్రహిస్తే ఈవిధంగా మాట్లాడరు.


Related Post