గోవా, మణిపూర్ రాష్ట్రాలలో భాజపా చాలా చురుకుగా పావులు కదిపి అధికారం దక్కించుకోవడానికి ప్రయత్నించింది. దానికి గవర్నర్లు కూడా సహకరించడడంతో మనోహర్ పార్రికర్ రేపు గోవా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి సిద్దం అయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించని విధంగా పావులు కదిపి భాజపా ప్రయత్నాలకు చెక్ పెట్టబోతోంది.
గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీని కాదని రెండవ స్థానంలో ఉన్న భాజపాకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఏవిధంగా అవకాశం కల్పించారు?ఇది రాజ్యాంగ విరుద్దం అంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో ఈరోజు ఒక అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు కూడా వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దానిని అత్యవసరంగా విచారించడానికి అంగీకరించింది.
ఒకవేళ సుప్రీంకోర్టు భాజపాకు వ్యతిరేకంగా తీర్పు చెపితే, రేపు గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పార్రికర్ ప్రమాణస్వీకారం చేయలేకపోవచ్చు. అదే జరిగితే, మణిపూర్ కు కూడా ఇదే తీర్పు వర్తిస్తుంది కనుక అక్కడ కూడా భాజపాకు బ్రేకులు పడవచ్చు. అది భాజపాకు, దానికి సహకరించినందుకు గవర్నర్లకు కూడా అవమానకరమే అవుతుంది. అదే..సాంప్రదాయం ప్రకారం గవర్నర్లు ముందుగా కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఇచ్చి అది శాసనసభలో బలనిరూపణ చేసుకోలేకపోతే భాజపాకు అవకాశం కల్పించి ఉండి ఉంటే ఈ దుస్థితి ఎదురయ్యేది కాదు కదా! ప్రజాస్వామ్య విధానాలను ఉల్లఘించినప్పుడు ఇటువంటి చేదు అనుభవాలు ఎదురవడం సహజమే. కనుక భాజపా అందుకు సిద్దపడక తప్పదు.