ఆసియా ఖండంలో పాకిస్తాన్ ఒక కేన్సర్ రోగం వంటిదని చెప్పవచ్చు. అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం దానిని కూడా కబళించి వేస్తోంది..అయినా దాని వైఖరిలో మార్పు కనబడటం లేదు. పాక్ లోని సింధు ప్రావిన్స్ లో ఒక ప్రార్ధనా మందిరంలో గురువారం జరిగిన బాంబు ప్రేలుళ్ళలో 80 మంది మరణించగా, మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ బాంబు దాడులను చైనా ఖండించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించింది.
ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నామని చెపుతున్న ఇదే చైనా, ఐక్యరాజ్యసమితి చేత మసూద్ అజహర్ ను తీవ్రవాదిగా ప్రకటింపజేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొంటోంది. తనకున్న అసాధారణమైన ‘విటో పవర్’ అతనిపై ఉగ్రవాది అనే ముద్ర పడకుండా కాపాడుకోస్తోంది. అతనికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు ఉంటే తప్ప భారత్ కు సహకరించలేమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జంగ్ షువాంగ్ శుక్రవారమే భారత్ కు తెలియజేశారు.
భారత్ ను దెబ్బ తీయడానికి తీవ్రవాదాన్ని ప్రోత్సహించడమే సరైన మార్గం అని పాక్ భావిస్తుంటే, దానికి చైనా వంత పాడుతోంది. భారత్ ఎదుగుదలను నియంత్రించడానికి అదే సరైన విధానం అని బహుశః చైనా కూడా భావిస్తునట్లుంది. అందుకే అది మసూద్ అజహర్ ను వెనకేసుకొస్తోందని అనుకోక తప్పదు.
చైనా ద్వంద వైఖరి వలన ప్రస్తుతం ఆ దేశానికేమీ నష్టం లేదు కానీ పాక్ దానికి బారీ మూల్యం చెల్లిస్తోంది. దాని పొరుగునే ఉన్న పాపానికి భారత్ కూడా మూల్యం చెల్లించవలసి వస్తోంది. ఆసియాలో తమ ఉనికిని చాటుకోవడానికి లేదా భారత్ పై ఆధిక్యత ప్రదర్శించుకోవడానికి తీవ్రవాదాన్ని పెంచి పోషించాలనుకోవడం ఒక వినాశకరమైన ఆలోచన. దానికి పాక్ ఇప్పటికే బారీ మూల్యం చెల్లిస్తోంది. చైనా కూడా ఏదో ఒకరోజు చెల్లించక తప్పదు.