ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే కాంక్రీట్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “ఈ ప్రాజెక్టు క్రింద ముంపుకు గురయ్యే ఏడు మండలాలు తెలంగాణా రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవిధంగా ఈ ప్రాజెక్టుని నిర్మించగలము. అందుకే నేను వాటిని తప్పనిసరిగా ఏపిలో కలుపవలసిందేనని గట్టిగా పట్టుబట్టడంతో ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపిలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేశారు. దానిని వెంటనే రాష్ట్రపతి ఆమోదించారు. అందుకు వెంకయ్య నాయుడు, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ చాలా సహకరించారు. అందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.
ఎప్పుడూ క్రెడిట్ కోసం ఆరాటపడే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న క్రెడిట్ కోసం ఆరాటపడటం సహజమే. కానీ ఆ తాపత్రయంలో ఆయన తెలంగాణా ప్రజల మానుతున్న గాయాన్ని మళ్ళీ కెలికారని చెప్పకతప్పదు. అంతకంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరు గురించి ఎన్ని గొప్పలు చెప్పుకొన్నా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.