వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నామని పదేపదే చెప్పిన సిఎం కేసీఆర్, టిఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆ విషయంపై మాట్లాడకపోవడాన్ని ప్రశ్నిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్కు గురువారం ఓ లేఖ వ్రాశారు. దానిలో వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో బంద్ నిర్వహించియా సిఎం కేసీఆర్ ఆ తరువాత యూ టర్న్ తీసుకోవడాన్ని ఆక్షేపించారు. సిఎం కేసీఆర్కు చిత్తశుద్ది ఉన్నట్లయితే తక్షణమే శాసనసభ, మండలిని సమావేశపరచి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. ముందు హడావుడి చేసిన సిఎం కేసీఆర్ ఇప్పుడు మౌనం వహించడానికి కారణం ఏమిటని భట్టి లేఖలో ప్రశ్నించారు. ఒకవేళ ఈ విషయంలో సిఎం కేసీఆర్ కేంద్రంతో రాజీపడి వెనక్కు తగ్గినట్లయితే రాష్ట్రంలో రైతుల నమ్మకాన్ని కోల్పోతారని హెచ్చరించారు. టిఆర్ఎస్ పోరాడినా పోరాడకపోయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగిస్తుందని భట్టి విక్రమార్క లేఖలో పేర్కొన్నారు.