నిన్న స్వామివివేకానంద జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ యువజన పార్లమెంటు ముగింపు వేడుకలలో యువతను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మన ప్రజాస్వామ్య వ్యవస్థకు వారసత్వ రాజకీయాలు చాలా ప్రమాదకరంగా మారాయి. అవి నియంతృత్వ పాలనను తిరిగి తీసుకువస్తున్నాయి. వాటి వలన అసమర్ధులు, అవినీతిపరులైన రాజకీయ నాయకులు అధికారం దక్కించుకోగలుగుతున్నారు. ఎందుకంటే వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చి అవలీలగా అధికారం దక్కించుకొన్నవారికి చట్టం, రాజ్యాంగం, వ్యవస్థల పట్ల నమ్మకం, గౌరవం రెండూ ఉండవు. తమ ముందు తరం నాయకులు ఎంత అవినీతికి పాల్పడినా శిక్షలు పడకుండా తప్పించుకోగలిగారు కనుక తాము చట్టాలకు అతీతులమని భావిస్తూ బరితెగించి వ్యవహరిస్తుంటారు. వారికి ఎంతసేపు నేను..నా కుటుంబ సభ్యులు...మా పదవులు...అధికారాలు...ఆస్తులపైనే దృష్టి ఉంటుంది తప్ప దేశప్రయోజనాలపై ఉండదు. ఒకప్పుడు రాజకీయాలలో వెళ్ళేవారిని సమాజం చిన్నచూపు చూసేది. కానీ ఇప్పుడు ఉన్నత విద్యావంతులు, మేధావులు రాజకీయాలలోకి ప్రవేశించి వ్యవస్థలలో పెను మార్పులు తీసుకువస్తున్నారు. కనుక యువత రాజకీయాలలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉంది,” అని అన్నారు.