రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో కూడా టికెట్లు, పదవులు దక్కనివారు అసంతృప్తిగా ఉండటం సహజం. అటువంటివారిలో మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మునిసిపల్ ఛైర్మన్ మురళీ యాదవ్ కూడా ఒకరని చెప్పవచ్చు. 2018 శాసనసభ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు కానీ పార్టీ టికెట్ లభించలేదు. మునిసిపల్ ఛైర్మన్ పదవి లభించినప్పటికీ తనవంటి ఉద్యమకారుడికి పార్టీలో తగినంత గుర్తింపు లభించలేదనే భావనతో ఉన్నారు. స్థానిక టిఆర్ఎస్ నేతల తీరుపట్ల ఆయన అనుచరులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. దాంతో మురళీయాదవ్, అనుచరులు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో బిజెపి బలం పుంజుకోవడంతో వారు బిజెపివైపు చూస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలో మంచిపట్టు, పలుకుబడి ఉన్న మురళీ యాదవ్ వంటి నేత పార్టీలోకి వస్తే బిజెపి కూడా బలపడుతుంది కనుక ఆయనను చెరుచుకోవడానికి సిద్దంగానే ఉంది. ఆయన బిజెపితో టచ్లో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.