కాంగ్రెస్ యువనేత విక్రమ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం బిజెపిలో చేరిపోయారు. బిజెపి నేతలు భూపేంద్ర యాదవ్, డికె.అరుణల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. తన అనుచరులకు జీహెచ్ఎంసీ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్లు ఇవ్వకపోతే పార్టీ వీడేందుకు సిద్దపడటంతో కాంగ్రెస్ పార్టీ ఆయన సూచించినవారికి టికెట్లు ఇచ్చింది. కానీ టికెట్లు ఇచ్చిన తరువాత ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేసారు. ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొన్న ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడతారనుకొంటే హటాత్తుగా గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో కూడా విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ బిజెపికి అనుకూలంగా ట్వీట్స్ చేస్తూ కాలక్షేపం చేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీలో ఆమె ఉండీ ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీలో హేమాహేమీలున్నప్పటికీ ఎవరూ చొరవ తీసుకొని పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ముందుకు రావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క వంటి కొద్దిమంది నేతలే భారమంతా భుజాన్న వేసుకొని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు పార్టీకి ఉపయోగపడరు...ఉపయోగపడేవారు పార్టీలో ఉండరన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.