ఈ కరోనా కష్టకాలంలో శక్తివంతమైన ప్రభుత్వాలే చేతులెత్తేస్తుంటే బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆపద్బాండావుడిలా నిరుపేదలను, నిస్సహాయులను ఆదుకొంటున్నాడు. ఆయన సాయానికి కులమతాలు, బాషాప్రాంతాలు, సరిహద్దులు అడ్డుగోడలు కావని నిరూపించే ఘటన మరొకటి జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మకూరులో తల్లితండ్రులు చనిపోవడంతో ముగ్గురు చిన్నారులు అనాధలుగా మారి అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వార్త ముంబైలో ఉన్న సోనూసూద్ చెవిలో పడింది. అంతే! మరో ఆలోచన లేకుండా ఆయన వెంటనే స్పందిస్తూ “ఇకపై ఆ ముగ్గురు పిల్లల పూర్తి బాధ్యత నాదే. వారి బాగోగులు నేనే చూసుకొంటాను,” అని హామీ ఇచ్చేశాడు. సోనూసూద్ హామీ ఇచ్చేడంటే అది తక్షణం అమలుచేస్తాడని అందరికీ తెలుసు. హైదరాబాద్లోని తన స్నేహితులు, అభిమానుల ద్వారా ఆ ముగ్గురు పిల్లలకు కావలసిన ఏర్పాట్లు చకచకా చేయిస్తున్నాడు.
మనలో చాలామందికి సమాజంలో ఇటువంటి వారికి ఏదో చేయాలని ఉంటుంది. కానీ అనేక కారణాలు, పరిమితుల వలన చేయలేకపోవచ్చు. అటువంటివారు సోనూసూద్ చేస్తున్న ఈ మహాయజ్ఞంలో పాలుపంచుకొంటే ఈ కష్టకాలంలో మనమూ సమాజానికి సేవ చేశామని తృప్తి కలుగుతుంది కదా?