లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా హైదరాబాద్ ఔటర్రింగ్ రోడ్డుపై వాహనాలు తిరుగకుండా నిలిపివేయడంతో నగరంలో రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం అంబులెన్సులు, సరుకు రవాణా వాహనాలను మాత్రమే ఔటర్రింగ్ రోడ్డుపై అనుమతించేవారు. ఇటీవల కేంద్రప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో ఔటర్రింగ్ రోడ్డుపై అనుమతి ఉన్న అన్నిరకాల వాహనాలు ప్రయాణించడానికి రాచకొండ, సైబరాబాద్ పోలీసులు అనుమతించడంతో మళ్ళీ చాలా రోజుల తరువాత ఔటర్రింగ్ రోడ్డుపై వాహనాలు దూసుకుపోతున్నాయి.
అయితే ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. ఔటర్రింగ్ రోడ్డుపై ప్రయాణించే కార్లు వగైరా నిర్దేశిత వేగంలోనే వెళ్లాల్సి ఉంటుంది. రోడ్డు ఖాళీగా ఉంది కదాని పరిమితికి మించి వేగంతో వెళ్ళినట్లయితే పోలీసులు కేసులు నమోదు చేస్తారు. సరుకు రవాణా చేస్తున్న వాహనాలు, భారీ వాహనాలకు మాత్రం ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది కనుక అవి ఏ సమయంలోనైనా ఔటర్రింగ్ రోడ్డుపై తిరుగవచ్చు. ఔటర్రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక ప్యాసింజర్ ఆటోలు, క్యాబ్లకు ప్రవేశం లేదని పోలీసులు తెలిపారు.