మహబూబ్నగర్ నుంచి డిల్లీ, మార్కజ్ మతసమావేశాలకు హాజరైన ఒక వ్యక్తి ద్వారా అతని ఇంట్లో ఓ వృద్ధురాలికి, ఓ 23 రోజుల పసికందుకు, తండ్రికి కరోనా వైరస్ సోకింది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వారి ముగ్గురినీ అంబులెన్సులో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో మంగళవారం కొత్తగా 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వాటితో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 404కి చేరింది. వారిలో 45 మంది పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 11 మంది కరోనాతో మృతి చెందారు.
డిల్లీ, మర్కజ్ మతసమావేశాలకు హాజరైనవారినందరినీ వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అధికారులు గుర్తించి ఆసుపత్రులకు, క్వారంటైన్ శిబిరాలకు తరలించారు. కనుక రాష్ట్రంలో కొత్తగా నమోదు అవుతున్న కరోనా కేసులన్నీ వారికి సంబందించినవే తప్ప బయట ఉన్న ప్రజలలో ఎవరికీ కొత్తగా కరోనా సోకినవి కావు. డిల్లీ, మర్కజ్ మతసమావేశాలకు హాజరైనవారికీ, వారి కుటుంబ సభ్యులకి, వారు కలిసినవారికీ అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించినందున, ఇప్పుడు వెలువడుతున్న కరోనా రిపోర్టులు వారికి సంబందించినవేనని ప్రజలు గ్రహించాలి. మరికొన్ని రోజులవరకు మర్కజ్ సంబందిత కరోనా కేసుల రిపోర్టులు వస్తూనే ఉంటాయి. అవన్నీ పూర్తయ్యేవరకు ప్రతీరోజూ కొన్ని కొత్త కరోనా కేసులు నమోదు అవుతూనే ఉంటాయి. కనుక రోజూ రోజుకి పెరుగుతున్న ఆ కరోనా కేసుల సంఖ్యను చూసి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందనవసరం లేదు.
మరికొన్ని రోజులలో మర్కజ్ బాధితుల రిపోర్టులన్నీ వచ్చేస్తే ఆ తరువాత రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవచ్చు. ఒకవేళ అయితే వాటినే పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న పలుచర్యల వలన ఏప్రిల్ 14న లాక్డౌన్ ముగిసేనాటికి రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్ కసులు నమోదు కావడం నిలిచిపోయే అవకాశాలున్నాయి.