ఇప్పుడు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో బాధలు పడుతోంది కానీ భారతదేశం గత కొన్నేళ్ళుగా ఇంచుమించు ఇటువంటి బాధలు, సంక్షోభాలనే అనుభవిస్తూ అధిగమిస్తోంది. 2016, నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆ తరువాత సుమారు ఆరు నెలలు ప్రజలు నానాకష్టాలు అనుభవించారు. ఆ తరువాత పుల్వామా ఉగ్రదాడి, భారత్-పాక్ మద్య యుద్ధవాతావరణంతో దేశ ఆర్ధికవ్యవస్థ కుడుపులకు లోనైంది.
దాని నుంచి కోలుకొని దేశం మళ్ళీ మెల్లమెల్లగా గాడినపడుతుంటే కేంద్రప్రభుత్వం జీఎస్టీని అమలులోకి తేవడంతో దేశంలోని వ్యాపారులు, పరిశ్రమలు, ఉత్పత్తి, వాణిజ్య రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కానీ జీఎస్టీతో దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో కొంత మేలు జరిగింది కనుక ఆశించినదానికంటే ముందే దేశం ఆ సమస్య నుంచి కూడా బయటపడింది.
వాటి తరువాత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ (ఎన్నార్సీ)లతో దేశం అల్లకల్లోలమైంది. అందరూ కరోనా భజనలోనే నిమగ్నమవడంతో ఇప్పుడు దేశంలో ఎవరూ సీఏఏ గురించి కనీసం ఆలోచించడం లేదు కూడా. కరోనా మహమ్మారి రాకతో సీఏఏ సమస్య దానంతట అదే తీరిపోయింది. హటాత్తుగా వచ్చి పడిన కరోనాను ఎదుర్కొనేందుకు దేశం సిద్దంగా లేదు కనుక లాక్డౌన్తో దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.
అయితే ఇంకా ఎంతోకాలం లాక్డౌన్ చేసుకొని కూర్చోలేము కనుక అన్ని వ్యవస్థలను మళ్ళీ ప్రారంభించక తప్పదు. లేకుంటే వీటన్నిటికంటే భయంకరమైన మరో సమస్య ఆర్ధికమాంద్యంలో చిక్కుకొనే ప్రమాదం పొంచి ఉంది.