కాంగ్రెస్‌ను బలహీనపరిచి టిఆర్ఎస్‌ తప్పు చేసిందా?

February 19, 2020


img

తెలంగాణ ప్రభుత్వం సీఏఏకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్దం అవుతుండటంతో, బిజెపి కూడా దానిని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దం అవుతోంది. కేంద్రహోంమంత్రి అమిత్ షా వచ్చే నెల 15వ తేదీన హైదరాబాద్‌ లాల్ బహద్దూర్ స్టేడియంలో సీఏఏకు అనుకూలంగా భారీ బహిరంగసభ నిర్వహించనున్నారని రాష్ట్ర బిజెపి నేతలు తెలియజేశారు. 

సీఏఏకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో 10 లక్షల మందితో బహిరంగసభను నిర్వహించి ప్రజల గొంతును కేంద్రానికి గట్టిగా వినిపిస్తానని సిఎం కేసీఆర్‌ చెప్పినందున, అమిత్ షా పాల్గొనబోయే బహిరంగసభను కూడా ఇంచుమించు ఆ స్థాయిలోనే నిర్వహించాలని రాష్ట్ర బిజెపి నేతలు పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. కనుక అమిత్ షా బహిరంగసభ తరువాత రాష్ట్రంలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య యుద్ధవాతావరణం ఏర్పడే సూచనలున్నాయి. 

గత ఐదేళ్ళుగా కాంగ్రెస్ పార్టీపై దృష్టి పెట్టిన టిఆర్ఎస్‌ అధిష్టానం, ఏనాడూ బిజెపిని పెద్దగా పట్టించుకోలేదనే చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా బలహీనపడితే దాని స్థానంలోకి బిజెపి ప్రవేశించగలదని, కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ కంటే అధికారంలో ఉన్న బిజెపితో పోరాడటం కష్టమని టిఆర్ఎస్‌ అధిష్టానం ఊహించకపోవడం చాలా ఆశ్చర్యకరమే. రాష్ట్రంలో బిజెపికి బలం, ప్రజాధారణ రెండూ లేవని భావించి పట్టించుకోలేదేమో? కానీ ఇప్పుడు అదే బిజెపితో టిఆర్ఎస్‌ కత్తులు దూసి పోరాడవలసి వస్తోంది. కాంగ్రెస్ పార్టీని కోలుకోలేనివిధంగా బలహీనపరచడంతో టిఆర్ఎస్‌ చేజేతులా ఇంకా బలవంతుడైన ప్రత్యర్ధిని తెచ్చిపెట్టుకొన్నట్లయింది. కనుక కాంగ్రెస్‌ను బలహీనపరచడం తొందరపాటుగానే కనిపిస్తోందిప్పుడు. 



Related Post